Hyderabad: హైదరాబాద్ నగరంలోని కొండాపూర్లో నిర్వహించబడిన రేవ్ పార్టీ కేసులో ఎక్సైజ్ పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అశోక్ నాయుడు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతి వీకెండ్కి ఏపీ నుండి యువతీ యువకులను హైదరాబాద్కు తీసుకొచ్చి పార్టీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పోలీసులు చేపట్టిన సుదీర్ఘ గూఢచర్యం తరువాత ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించగా, గంజాయి, డ్రగ్స్, కండోమ్స్ను స్వాధీనం చేసుకున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని మత్తుకు బానిసలుగా మార్చే ప్రయత్నంలో భాగంగా అశోక్ నాయుడు ఈ పార్టీలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులో మరో సంచలనం ఏమిటంటే, అశోక్ నాయుడు ఉపయోగించిన ఫార్చునర్ కారు (AP 39 SR 0001) పై లోక్సభ ఎంపీ స్టిక్కర్ అమర్చివుండటం. ఈ స్టిక్కర్ అతడు ఎవరి నుంచి పొందాడన్న అంశంపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా విచారణ జరుపుతోంది.
అరెస్టయిన నిందితుల్లో మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన 11 మంది యువకులు ఉన్నారు. కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ నాయుడితో పాటు, ఇతర నిందితులుగా ఉన్న శ్రీనివాస్ చౌదరి, అఖిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. రేవ్ పార్టీల వెనుక ఉన్న మత్తు మాఫియా కుట్రలు వెలుగులోకి రావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.