CP Sajjanar

CP Sajjanar: రౌడీషీటర్ల ఇళ్లలో దూరి సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్!

CP Sajjanar: సాధారణ పోలీసు పర్యటనలకు భిన్నంగా, ఎలాంటి ఆర్భాటం లేకుండా, అత్యంత గోప్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ అర్ధరాత్రి నగరంలో ఆకస్మిక పర్యటన చేసి సంచలనం సృష్టించారు. సాధారణ సైరన్‌లు, భద్రతా సిబ్బంది హడావుడి లేకుండా, స్వయంగా పెట్రోలింగ్ వాహనాన్ని ఎక్కి, క్షేత్రస్థాయిలో పోలీసింగ్ పరిస్థితిని సమీక్షించారు.

అర్ధరాత్రి 12 నుండి 3 గంటల వరకు గస్తీ

ఆదివారం అర్ధరాత్రి 12:00 గంటల నుండి తెల్లవారుజామున 3:00 గంటల వరకు సౌత్ వెస్ట్ జోన్‌లో సీపీ సజ్జనార్ పర్యటన కొనసాగింది. ముఖ్యంగా లంగ‌ర్‌హౌజ్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా ఉండే సున్నితమైన పాయింట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

రౌడీ షీటర్ల ఇళ్ల వద్ద సీపీ మెరుపు దాడులు

ఈ పర్యటనలో సీపీ తీసుకున్న అత్యంత కీలకమైన చర్య… రౌడీ షీటర్ల ఇళ్లలో చేసిన ఆకస్మిక తనిఖీ. లంగ‌ర్‌హౌజ్ పీఎస్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లోని రౌడీ షీటర్ల ఇళ్లకు ఆయన నేరుగా వెళ్లారు.

ఇది కూడా చదవండి: TG Colleges: కొత్త కాలేజ్ బిల్డింగ్స్.. స్మార్ట్ క్లాస్ రూమ్స్..కొత్త ఫర్నీచర్స్

ఇంట్లోనే ఉన్న రౌడీ షీటర్లను నిద్ర లేపి, వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు తమ నేర ప్ర‌వృత్తిని పూర్తిగా విడిచిపెట్టి సన్మార్గంలోకి రావాలని సూచించారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. రౌడీ షీటర్లు ప్రస్తుతం ఏ అడ్రస్‌లో ఉన్నారు అనే విషయం స్థానిక పోలీసులకు తప్పనిసరిగా తెలిసి ఉండాలని సీపీ ఆదేశించారు.

రాత్రివేళ తెరిచి ఉన్న దుకాణాలకు వార్నింగ్

టోలిచౌకి ప్రాంతంలో అర్ధరాత్రి వేళ నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉన్న హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లి వ్యాపారులకు సీపీ వార్నింగ్ ఇచ్చారు. రాత్రి వేళల్లో షాపులు తెరిచి ఉంచేందుకు ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతపై పరిశీలన

రాత్రిపూట ప్రజల భద్రత కోసం పెట్రోలింగ్ సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉన్నారు అనే విషయంపై సీపీ స్వయంగా ఆరా తీశారు.  విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను కలిసి గస్తీ పాయింట్లు, సమస్యలకు వారి స్పందన వేగం గురించి వివరాలు తెలుసుకున్నారు. టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా పరిశీలించారు.

‘విజిబుల్ పోలీసింగ్‌’కు ప్రాధాన్యం ఇవ్వాలని, నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి సమస్యకు వెంటనే స్పందించే విధంగా బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.

ముగింపులో సీపీ ఏమన్నారంటే..

పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌లో భాగంగా ఇలాంటి ఆకస్మిక పర్యటనలు చేస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది స్పందనను తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. ఈ పర్యటనలు సిబ్బంది బాధ్యతా భావాన్ని పెంపొందించడంతో పాటు, పౌరులకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరుస్తాయని ఆయన వెల్లడించారు. నగరంలో నేరాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *