Harish Rao: సీఎం వ్యక్తిగత భద్రతా విధుల నుంచి స్పెషల్ పోలీసులను తప్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 వేల మంది స్పెషల్ పోలీసులను అవమానించడమేనని చెప్పారు. సస్పెండ్, డిస్మిస్ చేసిన స్పెషల్ పోలీసులను వెంటనే విధులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్పెషల్ పోలీసుల సమస్యలపై రేవంత్ రెడ్డి వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
తన వ్యక్తిగత భద్రత నుంచి తెలంగాణ స్పెషల్ పోలీసులను తప్పించడం అనాలోచిత నిర్ణయం. పదిహేడు వేల మంది స్పెషల్ పోలీసులను తన చర్యతో సీఎం అవమాన పరిచారని చెప్పారు. స్పెషల్ పోలీసులు అంటే రాష్ట్రానికి మిలిటరీ లాంటి వారని. వారి ఆత్మస్థైర్యాన్ని సీఎం దెబ్బతీయకూడదని. స్పెషల్ పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం తక్షణమే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకోవాలను కోరారు.
ఏక్ పోలీస్ విధానాన్ని తీసుకురాబోతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం ఇప్పుడు స్పెషల్ పోలీసుల ఆందోళనపై కనీసం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సస్పెండ్, డిస్మిస్ అయిన స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లను తక్షణమే విధుల్లోకి చేర్చేందుకు సీఎం జోక్యం చేసుకోవాలనన్నారు. స్పెషల్ పోలీసుల పై సచివాలయ ముఖ్య భద్రతా అధికారి ఎమర్జెన్సీ తరహాలో ఆంక్షలు పెడుతూ విడుదల చేసిన సర్క్యూలర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో లైక్లు, షేర్లు చేసినా, ఆ పోలీసులు పట్ల చర్యలు ఉంటాయని పేర్కొనడం దుర్మార్గమని అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ అనే రాజ్యాంగ ప్రాథమిక హక్కును హరించే అధికారం ఎవరికీ లేదని హరీష్ రావు తెలిపారు.

