Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలో పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఆర్.పేట పోలీస్ స్టేషన్ (పీఎస్)లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తాజాగా పామర్రులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని చేసిన కొన్ని వ్యాఖ్యలే ఈ కేసు నమోదుకు కారణమయ్యాయి. శనివారం జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “రప్పా రప్పా” పాత డైలాగ్ అని, ఇప్పుడు “సైలెంట్గా నరకడమే” వ్యూహమంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ విధానం హింస, విధ్వంసమే అని ఆయన మాటల ద్వారా తేటతెల్లమైందని టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు.
Also Read: CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పించిన సీఎం రేవంత్రెడ్డి
మరోవైపు, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికపై టీడీపీ గూండాలు దాడి చేశారని పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. హత్యాయత్నం జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఉండిపోయారని, టీడీపీ గూండాలకు పోలీసులు రక్షణగా నిలిచారని ఆయన ఆరోపించారు. పోలీసుల సమక్షంలో దాడి జరిగితే ఇది “సైకో పాలన” కాదా అని నాని ప్రశ్నించారు. ఈ దాడి, హత్యాయత్నంపై హారిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ప్రభుత్వం దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందనే నమ్మకం లేదని ఆమె పేర్కొన్నారు.
ఇదే సమయంలో, మంత్రి కొల్లు రవీంద్ర పేర్ని నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని “బియ్యం దొంగ” అంటూ మండిపడ్డారు. ప్రభుత్వంపై కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై బురదజల్లుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని, వైఎస్సార్సీపీ మాజీ మంత్రులపైనా కేసులు పెడతామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, పేర్ని నానిపై కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.