Delhi: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టులోకి చేరింది. రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 6న ఈ పిటిషన్పై విచారణ ప్రారంభించనుంది. వంగ గోపాల్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నట్లుగా, 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడం సుప్రీంకోర్టు ఇప్పటికే ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని ఆయన ఆరోపిస్తున్నారు.
ఇక బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలుచేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8న విచారణ జరుపనుంది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ వివాదం హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటికీ చేరడం గమనార్హం.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే సిద్ధత మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం, ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

