Cm chandrababu: తెలుగుజాతి నాలెడ్జ్ ఎకానమీ మరియు ఆంట్రప్రెన్యూర్షిప్ లో ముందుండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎంత మంది జన్మలు వచ్చినా తాను తెలుగుజాతిలోనే పుట్టాలని, ప్రజలకు సేవ చేయాలని ఆయన అభిలషించారు.
తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, కంఠంనేని రవిశంకర్ సేవలను ప్రశంసించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, ఆయన మాట్లాడారు.
రవిశంకర్ పట్టుదల ఆదర్శప్రాయమైనది
చంద్రబాబు మాట్లాడుతూ, “తెలుగు వన్ 2000లో ప్రారంభమై ఈ రోజు 400కు పైగా ఛానళ్లతో ప్రపంచమంతా విస్తరించింది. రవిశంకర్ యొక్క పట్టుదల, దృఢసంకల్పం దీనికి మూలకారణం. నేను ఒక దృష్టికోణం ఇవ్వగలిగితే, ఆయన దానిని విజయవంతంగా అమలు చేశారు,” అన్నారు.
ఒకప్పుడు ఆకాశవాణి మాత్రమే ఉండేది, తర్వాత వార్తాపత్రికలు, అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా అభివృద్ధి చెందింది. ఇప్పుడైతే ఇంటి నుంచే మీడియా ఛానల్లు నిర్వహించగల సామర్థ్యం వచ్చింది. తెలుగు వన్ ఛానల్కు ఇప్పటికే 55 బిలియన్ వ్యూస్, 120 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. 16 లక్షలకు పైగా వీడియోలు, 1500కి పైగా సినిమాలతో తెలుగు వన్ ఒక శక్తివంతమైన డిజిటల్ వేదికగా ఎదిగిందని పేర్కొన్నారు.
అమరావతిపై సినిమాతో న్యాయం కోసం పోరాటం
కంఠంనేని రవిశంకర్ అమరావతి రాజధానిపై సినిమా తీసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో పరిస్థితులు భయంకరమైనా వెనకడుగు వేయకుండా ధైర్యంగా సినిమా తీసి, సెన్సార్ ఆపినా యూట్యూబ్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకువచ్చినదిగా కొనియాడారు. అలాగే 2000 మందికి ఉచిత శస్త్రచికిత్సలు చేయించిన సేవాకార్యక్రమాలపై అభినందనలు తెలిపారు.
అమరావతిని అభివృద్ధి చేయడం నా అదృష్టం
క్రియేటివ్ ఎకానమీకి ముంబై, అమరావతి రెండు కీలక నగరాలుగా అభివృద్ధి చేస్తున్నామని, అమరావతిని తెలుగుజాతికి గర్వకారణంగా తయారు చేస్తానని తెలిపారు. గతంలో హైదరాబాద్ను అభివృద్ధి చేసిన దిశగా ఇప్పుడు అమరావతిని రూపొందించేందుకు అవకాశమిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.