Crime News: వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం, కోస్గి మండలం, చంద్రవంచ గ్రామం పరిధిలో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన మూడు రోజులకే గొల్ల శ్రీలత (21) అనే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
వివాహం, ఆత్మహత్య వివరాలు
ఈనెల 26న శ్రీలతకు ఫరూక్నగర్ మండలం, భీమవరం గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. ఈనెల 27న నవ వధువు, వరుడు దోమ మండలం, మోత్కూరు గ్రామంలోని వధువు మామ ఇంటికి వచ్చారు. 28న శ్రీలత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీలత బుధవారం రాత్రి మృతి చెందింది.
ఇది కూడా చదవండి: Horoscope Today: వారికి ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి..
శ్రీలత మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఒక యువకుడిపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రవంచ గ్రామానికి చెందిన ఓ యువకుడి వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మరణానికి న్యాయం చేయాలంటూ శ్రీలత కుటుంబీకులు మృతదేహంతో కలిసి మహబూబ్నగర్ – తాండూర్ ప్రధాన రహదారిపై ఉన్న శివాజీ కూడలిలో రాస్తారోకోకు దిగారు. ఈ నిరసన కారణంగా ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


