Errabelli Dayakar : తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ రాజకీయం తిరిగేది. మొన్నటి వరకు ఓటమి ఎరగని ఆయన వరుస విజయాలకు 2023 సాధారణ ఎన్నికల్లో బ్రేక్ పడింది. రాజకీయ అనుభవం లేని కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1994లో తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలైన దయాకర్ రావు వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. కానీ, 2023 ఓటమి తర్వాత ఆయన ప్రాభవం తగ్గుతున్నట్లు చర్చ నడుస్తోంది.
గతంలో పార్టీలో ఎర్రబెల్లి మాటే నడిచేది. కేసీఆర్ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు సొంత పార్టీలోని గులాబీ నేతలు ఆయన ప్రయత్నాలకు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. 2028 డిలిమిటేషన్లో పాలకుర్తి నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ కావచ్చని, వర్ధన్నపేట జనరల్ అవుతుందని భావిస్తూ, అక్కడ పాగా వేయాలని దయాకర్ రావు ప్రయత్నిస్తున్నారు. కానీ, పార్టీలోని కొందరు నేతలు దీన్ని అడ్డుకుంటున్నట్లు సమాచారం.
Errabelli Dayakar : బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవన్నపేట శివారులో నిర్వహించాలని తొలుత అనుకున్నా, ఎర్రబెల్లి ఎక్కడ బాధ్యతలు తీసుకుంటారో అనే భయంతో.. దాన్ని హన్మకొండ జిల్లా ఎక్కతుర్తికి మార్చేలా పార్టీలోని ఇతర నేతలు అధిష్టానం వద్ద చక్రం తిప్పినట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. వర్ధన్నపేట బాధ్యతలను కూడా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. దీంతో ఎర్రబెల్లికి రాజకీయ జన్మనిచ్చిన వర్ధన్నపేట నియోజకవర్గం ఆయనకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: Ghibli Trends: కూటమి మైత్రిపై బాబు గిబ్లిఫైడ్ మెసేజ్!
ఎర్రబెల్లి మాత్రం సభ బాధ్యతలను తానే వద్దనుకున్నానని, ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఇబ్బందులు ఉంటాయని, తన పని తాను చేసుకుంటానని సన్నిహితులతో చెబుతున్నారట. పాలకుర్తి, వర్ధన్నపేట నుంచి సభకు భారీగా జన సమీకరణ చేసి.. గులాబీ బాస్ వద్ద తన సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఎర్రబెల్లి రాజకీయ హవా తగ్గుతుందా, లేక మళ్లీ పుంజుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.