Ap news: అధికారం కోల్పోయిన వైసిపి పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు రాజీనామాలు చేస్తున్నడంతో కేడర్ గుబులు మొదలైంది.ఇప్పటికే ముగ్గురు రాజసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు, పలువురు జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanthi Srinivas) కూడా రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చక అవంతి రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్.. భీమిలి నుంచి పోటీచేసి విజయం సాధించారు. అనంతరం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక ఆ పార్టీలో కొనసాగారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు.
అయితే 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్బై చెప్పారు. వైసీపీలో చేరిన ఆయన భీమిలి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై గెలుపొందారు. ఆ తర్వాత జగన్ కేబినెట్లో రెండున్నరేండ్ల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున భీమిలి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. ఈనేపథ్యంలో మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

