పోలీస్ అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
ఇవాళ ఉదయం ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.దేశం నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని షా చెప్పారు.తమ పదేళ్ల పాలనలో జమ్ముకశ్మీర్, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొన్నదని చెప్పారు. అయినా పోరాటాన్ని ఆపబోమని, కశ్మీర్లో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుందని షా తెలిపారు.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36,468 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని అమిత్ షా అన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.