Amaravati: జగన్ నాయకత్వంలోని వైసీపీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ శుక్రవారం నాడు అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
ఈ చేరికల కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు సునీల్, విజయశ్రీ, పులివర్తి నాని, అలాగే పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పేరాబత్తుల రాజశేఖర్, అనురాధ, చిరంజీవి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీటీ నాయుడు, రామ్గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ తదితరులు ఈ సందర్భంలో పాల్గొన్నారు. అదనంగా, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు కూడా హాజరయ్యారు.
ముగ్గురు ఎమ్మెల్సీలలో బల్లి కళ్యాణ్ చక్రవర్తి పదవీకాలం 2027 వరకు కొనసాగనుండగా, మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీల పదవీకాలం 2029 వరకు ఉంది. దీంతో శాసనమండలిలో టీడీపీ బలం మరింతగా పెరిగింది.
ఇప్పటికే వైసీపీకి చెందిన జయమంగళ వెంకటరమణ, పోతుల సునీతలు కూడా టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వరుసగా ఎమ్మెల్సీలు టీడీపీ వైపు వాలడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.