Abhishek Sharma: ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్లో పాకిస్తాన్తో జరిగిన పోరులో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన రికార్డు సృష్టించాడు. కేవలం తన 20వ అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్లోనే 50 సిక్సర్లు పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్యాటర్గా నిలిచాడు. అభిషేక్ శర్మ కేవలం 331 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకుని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఎవిన్ లూయిస్ (366 బంతులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డులో రసెల్, హజ్రతుల్లా జజాయ్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లను అభిషేక్ అధిగమించాడు. ఇన్నింగ్స్ల పరంగా కూడా అభిషేక్ శర్మ, ఎవిన్ లూయిస్ రికార్డును సమం చేశాడు.
ఇద్దరూ తమ టీ20 కెరీర్లో 20వ ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించారు. పాకిస్తాన్పై 74 పరుగులు చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్లో, అభిషేక్ శర్మ ఈ రికార్డును నెలకొల్పాడు. ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది బౌలింగ్లో తొలి బంతినే సిక్సర్గా మలిచి తన దూకుడైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో అతని మెరుపు ఇన్నింగ్స్ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్లో భారత్, పాకిస్థాన్పై మరోసారి ఘన విజయం సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన పోరులో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.