Amol Muzumdar: సీసీ మహిళల ప్రపంచ కప్ను భారత జట్టు తొలిసారిగా గెలుచుకున్న చారిత్రక విజయం అనంతరం, భారత మహిళా జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ విజయం భారత క్రికెట్కు ఒక ‘టర్నింగ్ పాయింట్’ అని అభివర్ణించారు. “నాకు మాటలు రావట్లేదు. అత్యంత గర్వంగా ఉంది. ఈ విజయానికి అమ్మాయిలు ప్రతి అంగుళం అర్హులు. వారి కష్టం, విశ్వాసం ప్రతి భారతీయుడి తల ఎత్తేలా చేశాయి,” అని విజయం తర్వాత ఆయన అన్నారు. ఈ విజయాన్ని ఆయన మైలురాయిగా అభివర్ణించారు. “ఇది ఒక చారిత్రక ఘట్టం. దీని ప్రభావం తరతరాల వరకు ఉంటుంది. యువతులు క్రికెట్ను చూసే విధానాన్ని ఇది మారుస్తుంది.
Also Read: BCCI: టీమ్ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా
ప్రతి చిన్న పట్టణంలో, ప్రతి అకాడమీలో ఈ విజయం ప్రతిధ్వనిస్తుంది,” అని ముజుందార్ పేర్కొన్నారు. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన షఫాలీ వర్మ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “షఫాలీ ఇవాళ అద్భుతం చేసింది. సెమీ-ఫైనల్ అయినా, ఫైనల్ అయినా ఆమె ప్రతిసారీ జట్టుకు పెద్ద ఇన్నింగ్స్ ఆడింది. పరుగులు, వికెట్లు, క్యాచ్లు – ఒక సంపూర్ణ ప్రదర్శన. ఇంతకంటే నేను గర్వపడలేను,” అని ప్రశంసించారు. దేశవాళీ క్రికెట్లో రికార్డులు సృష్టించినా, భారత జాతీయ జట్టుకు ఆడలేకపోయిన అమోల్ ముజుందార్కు కోచ్గా ఈ ప్రపంచ కప్ గెలవడం ఒక వ్యక్తిగత కల నెరవేరిన క్షణం. ఈ ట్రోఫీని గెలిచి తన కెరీర్కు పరిపూర్ణత తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ముజుందార్ నాయకత్వంలోనే భారత మహిళల జట్టు ఓటమిల నుంచి పాఠాలు నేర్చుకొని, ఆస్ట్రేలియాపై సెమీ-ఫైనల్లో చారిత్రక ఛేజింగ్ సాధించి, ఫైనల్లో సత్తా చాటింది.

