Bonda uma: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని. మంగళవారం ఆయన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం భాగంగా బొండా ఉమ స్వయంగా ప్రజల ఇళ్లకు వెళ్లి వారి అభిప్రాయాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఈ నెల రోజుల పాటు తన నియోజకవర్గంలోని 267 పోలింగ్ కేంద్రాల పరిధిలో పర్యటిస్తామని, ప్రజల మధ్యే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
స్థానికంగా ఎదురవుతున్న డ్రైనేజీ వంటి సమస్యలపై ప్రజలు తన దృష్టికి తీసుకురాగానే, వాటిని వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు అక్కడికక్కడే సూచనలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రజలు ప్రభుత్వ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేస్తుండటం సంతోషకరమని పేర్కొన్నారు.
బొండా ఉమ మాట్లాడుతూ, “ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉంది. ఆగస్టు నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్ట్రీ నిధి పథకాలను అమలు చేయనున్నాం. ఇప్పటికే అభివృద్ధి పనుల కోసం రూ.240 కోట్లు కేటాయించాం. అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాం. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తూ, వాటిని వేగంగా పరిష్కరించే విధంగా పనిచేస్తాం,” అని వివరించారు.
ఇక వైసీపీపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి వైసీపీ నేతలు అసహనం చెంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మీడియా ముందుగా మాట్లాడకుండా ప్రజల మధ్యకు వచ్చి వాస్తవాలు తెలుసుకోగలిగితేనే విమర్శలకు అర్హత ఉంటుంది. గతంలో హామీలను అమలు చేయకపోయిన జగన్ ప్రభుత్వం ప్రజలను మోసగించింది. కూటమి పాలనపై విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదు” అని బొండా ఉమ ధ్వజమెత్తారు.

