Hyderabad: హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం ఒక్కసారిగా విషాదానికి నిలయంగా మారింది. బ్యాంకు భవనంలోని లిఫ్ట్లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతన్ని హత్య చేసి.. మృతదేహాన్ని లిఫ్ట్లో వదిలి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సమాచారం అందుకున్న దోమలగూడ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ను రంగంలోకి దించి హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. లిఫ్ట్ను పూర్తిగా పరిశీలించి.. వేలిముద్రలు, ఇతర కీలకమైన ఆధారాలను భద్రపరిచే ప్రయత్నం చేస్తున్నారు. హత్య జరిగిన తీరును బట్టి.. ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని ఎక్కడ హత్య చేశారు, ఎలా లిఫ్ట్లోకి తీసుకొచ్చారు అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు.
Also Read: Telangana: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి..
ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును పర్యవేక్షించారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మృతుడు ఎవరు, అతనికి ఎవరితో శత్రుత్వం ఉంది, హత్యకు గల మోటివ్ ఏమిటనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు సిబ్బందిని , స్థానికులను కూడా విచారించి సమాచారం సేకరిస్తున్నారు.
ఈ ఘటన హిమాయత్ నగర్ వంటి రద్దీ ప్రాంతంలో జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒక బ్యాంకు భవనంలో హత్య జరగడం భద్రతాపరమైన లోపాలను ఎత్తిచూపుతోంది. పోలీసులు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు. హత్య జరిగిన సమయంలో బ్యాంకులో ఎవరు ఉన్నారు..? బయటి వ్యక్తులు ఎవరైనా లోపలికి వచ్చారా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసును పోలీసులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇస్తున్నారు. మృతుడి వివరాలు తెలిస్తే కేసు దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది.