Vijayawada

Vijayawada: విజయవాడలో దారుణం: పగతో పిన్నిని ముక్కలు ముక్కలుగా నరికిన అక్క కొడుకు

Vijayawada: విజయవాడలోని ఊర్మిళానగర్‌ ప్రాంతంలో మానవత్వం మరచిపోయే దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నియే కారణమని అనుమానం పెంచుకున్న మేనల్లుడు, ఆమెపై పగ తీర్చుకునేందుకు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ హత్యలో నిందితుడి మైనర్ కుమారుడు కూడా సహకరించడం విస్మయం కలిగించింది. గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన వృద్ధురాలి కేసును దర్యాప్తు చేయగా ఈ విషయం బయటపడింది.

భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊర్మిళానగర్‌లో నివాసం ఉండే వృద్ధురాలు (పిన్ని) నిందితుడి ఇంటికి సమీపంలోనే ఉంటారు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో నిందితుడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి పిన్నే కారణమని నిర్ణయించుకున్న నిందితుడు ఆమెను చంపడానికి పక్కా ప్రణాళిక వేశాడు. 2025 అక్టోబర్ 1వ తేదీన, మాయమాటలు చెప్పి పిన్నిని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు.

Also Read: Chandrababu Naidu: అనంతపురంలో శిశు మృతి, కురుపాం విద్యార్థుల అస్వస్థతపై సీఎం చంద్రబాబు ఆరా!

అప్పటికే సిద్ధం చేసుకున్న పదునైన ఆయుధాలతో, తన మైనర్ కొడుకు సహాయంతో కలిసి వృద్ధురాలిపై దాడి చేసి చంపేశాడు. చనిపోయిన తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. తల, చేతులు, మొండెం భాగాలను వేరు చేసి గోనె సంచుల్లో కట్టి, విజయవాడలోని అక్కనిసన్ స్కూల్ సమీపంలోని మురుగు కాల్వల్లో, బొమ్మసాని నగర్‌లోని కాల్వలో పడేశాడు.

వృద్ధురాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడిని గుర్తించారు. ఈ దారుణం తర్వాత నిందితుడు తన మైనర్ కుమారుడితో కలిసి నంద్యాలకు పారిపోగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో హత్య చేసిన విషయాన్ని నిందితుడు అంగీకరించాడు. మృతదేహ భాగాలను సేకరించిన పోలీసులు, మిగిలిన కాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, పగతో సాగిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *