Uttam Kumar Reddy: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమని తెలిపారు.
ఈ రోజు బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆయన పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపునకు రూట్ మ్యాప్ రూపొందించుకోవాలని నేతలకు సూచించారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రిహార్సల్లా ఉంటాయన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమర్థంగా పనిచేయిస్తే విజయం సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలను స్థానిక సంస్థల ఎన్నికల నాటికి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గత ఏడాదిలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఉపాధ్యాయ నియామకాలు సహా పలు నియామకాలు చేపట్టినట్లు మంత్రి వివరించారు.

