Talasani srinivas: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేల లంచ్ మీటింగ్ ముగిసింది. జూబ్లీహిల్స్లోని తలసాని నివాసంలో ఈ సమావేశం దాదాపు రెండున్నర గంటలు కొనసాగింది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ఈ సమావేశం పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో నిర్వహించిన సమావేశమని తెలిపారు. అయితే, రాజకీయ అంశాలపై కూడా చర్చించామన్నారు.
జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడంపై చర్చించుకున్నట్లు తలసాని చెప్పారు. అయితే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్చ జరగలేదని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై ప్రభుత్వ మోసాన్ని ప్రజలకు తెలియజేసే దిశగా సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పారు. రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు.
“స్ట్రీట్ వెండర్స్ను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు వారిని పూర్తిగా తొలగించేందుకు చూస్తోందని” తలసాని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ గీత దాటితే, తమకు కూడా గీత దాటాల్సి వస్తుందని హెచ్చరించారు.
మరొక వైపు, బీఆర్ఎస్ నేతల కుటుంబ వారసులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే అంశంపై కూడా ఈ లంచ్ మీటింగ్లో చర్చ జరిగినట్లు సమాచారం.