Subhanshu Shukla

Subhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తొలి సందేశం: ‘ఇదో గొప్ప ప్రయాణం’

Subhanshu Shukla: భారత అంతరిక్ష రంగంలో ఓ సరికొత్త అధ్యాయం మొదలైంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అంతరిక్షం నుంచి తన తొలి సందేశాన్ని భారత ప్రజలకు పంపారు. దేశ ప్రజలకు నమస్కారం తెలుపుతూ, ఈ ప్రయాణం ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు.

బుధవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా శుభాంశు శుక్లా తన సహ వ్యోమగాములతో కలిసి నింగిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వారి వ్యోమనౌక ఇప్పుడు భూకక్ష్యలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. “నా భుజాలపై మన త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తుంటే నాతో మీరంతా ఉన్నారనే భావన కలుగుతోంది” అని శుక్లా తన సందేశంలో ఉద్వేగంగా తెలిపారు.

ఇది కేవలం తన ఒక్కడి అంతరిక్ష ప్రయాణం కాదని, భారతదేశ మానవ సహిత రోదసి యాత్రకు ఇది ఒక శుభారంభం అని శుభాంశు శుక్లా స్పష్టం చేశారు. “అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా తినాలనేది శిశువులా నేర్చుకుంటున్నాను. భారత అంతరిక్ష రంగంలో ఇది స్థిరమైన, దృఢమైన అడుగు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రయాణంలో దేశ ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. “జై హింద్, జై భారత్” అంటూ తన సందేశాన్ని ముగించారు.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ.. సోషల్ మీడియాలో హల్ చల్

Subhanshu Shukla: శుభాంశు శుక్లా బృందం గురువారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో విజయవంతంగా అనుసంధానం కానుంది. వీరు రాబోయే 14 రోజులు ఐఎస్‌ఎస్‌లోనే గడుపుతారు. ఈ సమయం లోపల, వారు గురుత్వాకర్షణ లేని వాతావరణంలో కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా, వ్యోమగాములు అంతరిక్షం నుంచే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, పాఠశాల విద్యార్థులతో, ఇతర ప్రముఖులతో సంభాషించనున్నారు. ఐఎస్‌ఎస్‌లో పొందిన అనుభవాలను పంచుకోవడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని శుభాంశు శుక్లా వెల్లడించారు. సుమారు 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారతీయ వ్యోమగామి అంతరిక్షంలోకి అడుగుపెట్టడం నిజంగా గొప్ప విషయం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *