Tazmin Brits: సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ తజ్మిన్ బ్రిట్స్ ఇటీవల మహిళల వన్డే (ODI) క్రికెట్లో రెండు అద్భుతమైన ప్రపంచ రికార్డులను సృష్టించింది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో ఐదు వన్డే సెంచరీలు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా క్రికెటర్గా బ్రిట్స్ చరిత్ర సృష్టించింది. ఈ రికార్డుతో ఆమె టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (ఒక క్యాలెండర్ ఇయర్లో 4 సెంచరీలు) రికార్డును బద్దలు కొట్టింది. వన్డే క్రికెట్లో వేగంగా (అంటే అతి తక్కువ ఇన్నింగ్స్లలో) ఏడు సెంచరీలు పూర్తి చేసిన ప్లేయర్గా కూడా బ్రిట్స్ రికార్డు సృష్టించింది.ఆమె కేవలం 41 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించింది, అంతకుముందు ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లానింగ్ (44 ఇన్నింగ్స్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.
ఇది కూడా చదవండి: KL Rahul: ‘కాంతారా చాప్టర్ 1’కి ఫిదా అయిన స్టార్ క్రికెటర్ కె.ఎల్. రాహుల్
ఈ రికార్డులను ఆమె ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ (101 పరుగులు) చేయడం ద్వారా అందుకుంది. బ్రిట్స్ క్రికెట్లోకి రాకముందు జావెలిన్ త్రో అథ్లెట్గా ఉండేది. 2012 లండన్ ఒలింపిక్స్కు అర్హత కూడా సాధించింది, కానీ 2011లో కారు ప్రమాదం కారణంగా ఆమె అథ్లెటిక్స్ కెరీర్కు ముగింపు పలికింది.ఆమె గత ఐదు వన్డే ఇన్నింగ్స్లలో నాలుగు సెంచరీలు సాధించడం విశేషం. ప్రపంచంలో తజ్మిన్, లాన్నింగ్ మినహా ఏ ఒక్క మహిళా ప్లేయర్ కూడా కనీసం 50 ఇన్నింగ్స్ల్లో 7 వన్డే సెంచరీలు పూర్తి చేయలేకపోయారు. మ్యాచ్ విషయానికొస్తే.. తజ్మిన్ మెరుపు సెంచరీతో (89 బంతుల్లో 101; 15 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో న్యూజిలాండ్పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తజ్మిన్కు సూన్ లస్ (83 నాటౌట్) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా సునాయాస విజయాన్ని సాధించింది.