Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టులకు కీలక పిలుపునిచ్చారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి, జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. ఇటీవల కొందరు మావోయిస్టులు లొంగిపోయారని గుర్తు చేస్తూ, మిగిలిన వారు కూడా తమ పార్టీ నుంచి బయటకి వచ్చి దేశాభివృద్ధిలో భాగం కావాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో తమ కర్తవ్యం నిర్వర్తించాలని ఉద్బోధించారు.
మంగళవారం నాడు హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, ‘అమరులువారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2008లో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 33 మంది పోలీసు అమరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
రాష్ట్రంలో తగ్గుతున్న ఉగ్ర, మావోయిస్టు కార్యకలాపాలు
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గతంతో పోల్చితే రాష్ట్రంలో ఉగ్రవాదులు, మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గాయని తెలిపారు. శాంతిభద్రతలు బాగున్నప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, తద్వారా ఆర్థిక వ్యవస్థ బలపడి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని చెప్పారు. మావోయిస్టులు ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
పోలీసులకు గౌరవంతోనే రాష్ట్ర గౌరవం పెరుగుతుందని పేర్కొంటూ, పోలీసులు ఇదే పనితీరు కొనసాగిస్తూ పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని, నైతిక విలువలను కాపాడాలని సూచించారు. సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ విధానాన్ని అనుసరించాలని కోరారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్పై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు
చట్టాలను గౌరవించేవారికే ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తిస్తుందని, చట్టాలను ఉల్లంఘించేవారికి కాదని సీఎం స్పష్టం చేశారు. నిరసనలకు అనుమతినిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. “పోలీసులంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా” అని పేర్కొంటూ, ప్రపంచం నిద్రపోతున్నా శాంతిభద్రతలను కాపాడేది వారేనని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన వీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం అని తెలిపారు.
అమరవీరుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం
ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 191 మంది పోలీసు సిబ్బంది అసువులు బాశారని, తెలంగాణలో ఆరుగురు ప్రాణాలర్పించారని సీఎం తెలిపారు. ఇటీవల నిజామాబాద్లో విధి నిర్వహణలో మరణించిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున భారీ సహాయం ప్రకటించారు:
* రూ. కోటి ఎక్స్గ్రేషియా
* పదవీ విరమణ వయసు వరకు జీతం చెల్లింపు
* కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
* 300 గజాల స్థలం మంజూరు
* పోలీసు భద్రత నిధి నుంచి రూ. 16 లక్షలు, సంక్షేమ నిధి నుంచి రూ. 8 లక్షలు చెల్లింపు.
అంతేకాకుండా, 2008లో ఒడిశాలోని చిత్రకొండ (బలిమెల) రిజర్వాయర్ వద్ద మావోయిస్టుల దాడిలో అమరులైన 33 మంది పోలీసుల కుటుంబాలకు మేడ్చల్ జిల్లాలోని గాజులరామారంలో 200 చదరపు గజాల చొప్పున స్థలాలను తమ ప్రభుత్వం కేటాయించనుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్, సాంకేతికతపై దృష్టి: డీజీపీ శివధర్ రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ… పోలీసు అమరత్వం నుంచి తాము స్ఫూర్తి, ప్రేరణ పొందుతున్నామని తెలిపారు. తీవ్రవాదం, మతతత్వ ధోరణులు, అసాంఘిక శక్తులు, వ్యవస్థీకృత నేరగాళ్లను ఎదుర్కొంటూ ఎందరో పోలీసులు వీరమరణం పొందారని చెప్పారు.
పోలీసులు తమ విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ను మరువకూడదని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని, స్నేహాన్ని చూరగొనటమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అభివర్ణించారు. సాంకేతికత, కృత్రిమ మేధ (AI) సాయంతో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
సామర్థ్యం ఆధారంగా పోస్టింగ్లు: ముఖ్యమంత్రి
పోలీసు అధికారుల పనితీరుకు తగినట్టుగానే పోస్టింగ్లు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసు విభాగంలో కీలక విభాగాల్లో మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలిచామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 16 వేల మంది కానిస్టేబుళ్లు, ఎస్సైలను నియమించామని, పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా సమర్థత, అనుభవం ప్రాతిపదికన అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. పోలీసు సిబ్బంది పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశామని, ఇక్కడి సీట్లలో 50% పోలీసు సిబ్బంది పిల్లలకే కేటాయించామని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్ర పోలీసులు డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆర్థిక నేరగాళ్లు, గుట్కా, మట్కా వంటి నేరాలకు అడ్డుకట్ట వేయడంలో సమర్థంగా పనిచేస్తున్నారని, నేరం చేస్తే తప్పించుకోలేమనే విశ్వాసాన్ని ప్రజల్లో పెంచారని ఆయన ప్రశంసించారు.