Ap rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందన్నారు.
నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.గడిచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.
కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం వరకు పోర్టులకు మూడో నంబరు, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు అధికారులు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.
మరో వైపు తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల తీరప్రాంతాల్లో 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. మధ్యాహ్నం వరకూ తీరం అలజడిగానే ఉంటుందని తెలిపింది.