Rahul Gandhi: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు: రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

Rahul Gandhi: అమెరికా తాజాగా హెచ్-1బీ వీసా ఫీజును భారీగా పెంచిన నిర్ణయం భారత్‌లో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ పరిణామంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటైన విమర్శలు చేశారు.

శనివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్’ లో రాహుల్ గాంధీ స్పందిస్తూ, “మళ్లీ చెబుతున్నా… భారత్‌కు బలహీన ప్రధాని ఉన్నారు” అంటూ మండిపడ్డారు. హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా 1,00,000 డాలర్లకు పెంచడం వల్ల ఎక్కువగా నష్టపోయేది భారతీయులేనని ఆయన పంచుకున్న వార్తా కథనాన్ని జత చేశారు. అంతేకాకుండా, 2017 జూలై 5న తాను చేసిన పాత పోస్టును కూడా గుర్తు చేశారు.

ప్రస్తుతం హెచ్-1బీ వీసాలలో 71 శాతం భారతీయులే ఉన్నారని, ఈ నిర్ణయం వారిపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో 1,700 నుంచి 4,500 డాలర్ల మధ్య ఉన్న ఈ ఫీజును అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్‌గా లక్ష డాలర్లకు పెంచినట్లు తెలుస్తోంది. వీసా ప్రోగ్రామ్‌ దుర్వినియోగాన్ని అరికట్టి, స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యమని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. కాంగ్రెస్‌ ఎంపీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, “ఒకవైపు ట్రంప్‌తో గొప్ప స్నేహం అంటారు, మరోవైపు భారతీయులపై ఇలాంటి భారం మోపుతున్నారు. మోదీ తనను తాను రాజులా భావిస్తున్నారు” అని ఎద్దేవా చేశారు. మరో కాంగ్రెస్‌ నేత సురేంద్ర రాజ్‌పుత్ మాట్లాడుతూ, “మోదీకి స్నేహితుడినని చెప్పుకుంటూనే అమెరికా శత్రువులా ప్రవర్తిస్తోంది. చాబహార్ పోర్టు ఆంక్షలు, భారత వస్తువులపై 50 శాతం టారిఫ్‌ల వరకు అన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి” అని విమర్శించారు.

హెచ్-1బీ వీసా అంటే ఏమిటి?

హెచ్-1బీ వీసా అనేది అమెరికా కంపెనీలు ఐటీ, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలలో నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి ఇచ్చే వర్క్ పర్మిట్‌. ఏటా సుమారు 85,000 వీసాలు జారీ అవుతాయి. తాజా ఫీజు పెంపు భారతీయ టెకీలపై మాత్రమే కాకుండా, వారిని నియమించుకునే అమెరికన్‌ టెక్ కంపెనీలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపనుంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *