Pulivendula: కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘంతో కలిసి తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్కు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలను అదుపు చేయడానికి పోలీసులు పలువురు వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు ఆఫీసులోనే నిర్బంధించారు.
పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు కార్యాలయంలో నిర్బంధించడాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. వారు వినకపోవడంతో పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన డీఎస్పీ కోయ ప్రవీణ్, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కాల్చి పడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్.. యూనిఫాం ఇక్కడ” అంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రబాబు, లోకేశ్ పగబట్టారు: ఎంపీ అవినాష్ రెడ్డి
ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ… పులివెందులపై చంద్రబాబు, లోకేశ్ పగబట్టారని ఆరోపించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. పోలీసులు చేయాల్సిన నష్టం అంతా చేశారని, ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఎలాంటి ఆవేశాలకు లోనుకావొద్దని సూచించారు. ఈ సమస్యలన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొందామని ఆయన స్పష్టం చేశారు.
కాల్చి పడేస్తా నా కొడకా!
పులివెందుల వైఎస్సార్ సిపి కార్యాలయం వద్ద దౌర్జన్యానికి పాల్పడిన డిఎస్పీ pic.twitter.com/jBwiIOR6Ls
— YSR Congress Party (@YSRCParty) August 12, 2025