IND vs NZ Test: రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 180/3

IND vs NZ Test: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘోరంగా విఫలమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ తడబడగా.. న్యూజిలాండ్ అదరగొడుతోంది. దీంతో తొలి టెస్టులో కివీస్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తొలుత బంతితో అదరగొట్టిన కివీస్.. తర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతోంది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ జట్టు 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

ఓపెనర్ డేవాన్ కాన్వే (91, 105 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి శతకం ముంగిట పెవిలియన్ చేరాడు. విల్ యంగ్ (33), టామ్ లాథమ్ (15) పరుగులు చేశారు. క్రీజులో రచిన్‌ రవీంద్ర (22), డారిల్ మిచెల్(14)లు ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్‌ తలో వికెట్ పడగొట్టారు.

హడలెత్తించిన కివీస్ బౌలర్లు
స్వదేశంలో తిరుగులేదని జోష్ మీదున్న భారత్‌కు దిమ్మదిరిగేలా కివీస్‌ బౌలర్లు దెబ్బకొట్టారు. వర్షం కారణంగా తొలిరోజు రద్దైన మొదటి టెస్టు రెండోరోజు ఆటలో మాత్రం టీమ్‌ఇండియా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కివీస్‌ చెలరేగిపోయింది. పరుగుల సంగతి పక్కనపెడితే.. బంతిని ఎదుర్కోవాలంటే భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. నలుగురు టాప్‌ క్లాస్‌ బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరడం గమనార్హం. ఈ క్రమంలో రిషభ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) కాసేపు పోరాడారు. అయితే, కివీస్ బౌలర్లు చెలరేగడంతో భారత్ 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే ఆలౌటైంది. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. టిమ్‌ సౌథీ ఓ వికెట్‌ తీశాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *