Hydra Ranganath

Hydra Ranganath: కోర్టు మెట్లు ఎక్కిన ‘హైడ్రా’ కమిషనర్.. చివరికి క్షమాపణతో ఉపశమనం

Hydra Ranganath: హైదరాబాద్‌కు చెందిన ‘హైడ్రా’ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టు ముందు హాజరై, చివరికి తన తప్పును ఒప్పుకుంటూ కోర్టుకు క్షమాపణ చెప్పారు. ఈ వ్యవహారం మొత్తం బతుకమ్మకుంట ప్రాంతంలోని ఒక భూమికి సంబంధించిన కేసు విచారణలో జరిగింది. ఈ కేసులో, హైడ్రా సంస్థపై ఎ. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ, కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, కమిషనర్‌ను స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించగా, ఆ ఆదేశాల మేరకు రంగనాథ్ గారు కోర్టుకు వచ్చారు.

అసలు వివాదం ఏంటంటే…
బతుకమ్మకుంట పరిధిలోని ఒక ప్రైవేటు స్థలం విషయంలో, కోర్టు గతంలో ఒక ముఖ్యమైన ఆదేశాన్ని ఇచ్చింది. ఆ ఆదేశం ఏమిటంటే “స్థలంలో ఉన్న పరిస్థితిని ఏ విధంగానూ మార్చకుండా, యథాతథంగా కొనసాగించాలి” అని. ఈ ఉత్తర్వులను హైకోర్టు జూన్ 12న జారీ చేసింది. అయితే, హైడ్రా కమిషనర్ ఆ ఆదేశాలను పాటించకుండా ఉల్లంఘించారని, అందుకే ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.

ధర్మాసనం ఆగ్రహం: ‘ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబెట్టగలం’
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోరాదో నవంబర్ 27న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, కమిషనర్ రంగనాథ్ తనకు బాచుపల్లిలో అత్యవసర పనులు ఉన్నాయని చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు కోరుతూ ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ రావులతో కూడిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది, కమిషనర్ హాజరుతో కోర్టుకు ఇబ్బంది కలగకూడదనే మినహాయింపు కోరుతున్నారని చెప్పగా, ధర్మాసనం “ఆయన కోర్టు పట్ల చూపిన దయకు అభినందనలు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. అంతేకాదు, “కోర్టు తలచుకుంటే, కోర్టు ధిక్కరణను ఎదుర్కొంటున్న కమిషనర్‌ను ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో నిలబెట్టగలదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని గట్టిగా హెచ్చరించింది. మినహాయింపు కోరుతూ కమిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది.

చివరికి కోర్టుకు హాజరై క్షమాపణ
ధర్మాసనం ఇచ్చిన హెచ్చరిక, అలాగే మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించడంతో… తప్పనిసరి పరిస్థితుల్లో, కమిషనర్ రంగనాథ్ తాజాగా శుక్రవారం హైకోర్టు ముందు హాజరయ్యారు. అక్కడ ఆయన తన తప్పును ఒప్పుకుంటూ, న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై, అలాగే మొదట హాజరు కాకుండా మినహాయింపు కోరడంపై ధర్మాసనం ముందు ఆయన క్షమ కోరారు. దీంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు అయ్యింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *