Rain Alert

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం తీవ్రతరం చేస్తుంది. ఇప్పటికే పలుచోట్ల కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని దెబ్బతీయగా, రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటన ప్రకారం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని సూచించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల్లో గాలుల వేగం పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణలో వర్షాల తీవ్రత

తెలంగాణలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతుండగా, రానున్న రెండు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్ వంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30–40 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Nara Lokesh: మైసూరు ఉత్సవాలకు దీటుగా విజయవాడ ఉత్సవ్

హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వందల కాలనీలు, ప్రధాన రహదారులు నీటమునిగాయి. బంజారాహిల్స్‌లో 10.3 సెం.మీ., శ్రీనగర్ కాలనీలో 9.7 సెం.మీ., ఖైరతాబాద్‌లో 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 16 సెం.మీ. వర్షం కురవడం వర్షాల తీవ్రతను సూచిస్తోంది. నేడు సాయంత్రం కూడా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించారు.

కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం

ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పపీడనం ఆగిపోకుండానే ఈ నెల 25న తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది 26నాటికి వాయుగుండంగా మారి, 27న దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్ర తీరాలను తాకే అవకాశం ఉందని అంచనా. ఆ సమయంలో తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

ప్రజలకు సూచనలు

  • తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్ర యాత్రలు మానుకోవాలి.

  • రైతులు వర్షాల తీవ్రత దృష్ట్యా పంట పనులు సవరించుకోవాలి.

  • లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

  • అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *