Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం (ఈరోజు) జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరియు విద్యా భాగస్వామ్యంపై చర్చించారు.
డ్యుయిష్ బోర్స్ GCC ప్రారంభం, వెయ్యి ఉద్యోగాలు
జర్మనీ బృందం సీఎం రేవంత్ రెడ్డికి డ్యుయిష్ బోర్స్ (Deutsche Borse) కంపెనీ విస్తరణ ప్రణాళికలను వివరించింది. డ్యుయిష్ బోర్స్ సంస్థ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ను ఇవాళ హైదరాబాద్లో ప్రారంభిస్తున్నట్లు జర్మనీ బృందం ముఖ్యమంత్రికి తెలియజేసింది.
ఈ జీసీసీ ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు జర్మనీ బృందం వివరించింది. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
పెట్టుబడులు, భాషా సహకారం కోసం సీఎం విజ్ఞప్తి
హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు జర్మనీ సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందన్నారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు.
ఇది కూడా చదవండి: Telangana: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షురూ.. స్పీకర్ షెడ్యూల్ ఖరారు!
విద్యా, నైపుణ్య శిక్షణ:
హైదరాబాద్లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని కాన్సుల్ జనరల్కు విజ్ఞప్తి చేశారు. TOMCOM ద్వారా వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని కోరారు.
హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్ గా తయారు చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి జర్మనీ బృందాన్ని కోరారు. సమావేశంలో పాల్గొన్నవారు: ఈ భేటీలో అమిత దేశాయ్, డ్యుయిష్ బోర్స్ CIO/COO డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

