Road Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ఇన్ఫోసిస్ ఉద్యోగిని దుర్మరణం పాలయ్యారు. అదే కారులో ఉన్న మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం (సెప్టెంబర్ 15) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
జరిగింది ఏమిటంటే..
నగరంలోని ఒకే సంస్థలో పనిచేస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఎనిమిది మంది సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో 25 ఏళ్ల సౌమ్యా రెడ్డి అనే యువతి అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల.
గాయపడిన వారు..
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని నంద కిశోర్, వీరేంద్ర, ప్రనీష్, అరవింద్, సాగర్, ఝాన్సీ, శ్రుతిగా గుర్తించారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటన ఇన్ఫోసిస్ ఉద్యోగుల మధ్య, అలాగే మృతురాలి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.