Chouhan: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాకిస్థాన్ను హెచ్చరిస్తూ, భారత్ను కవ్వించాలన్న యత్నాలు చేస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉనికే సంకటంలో పడుతుందని పేర్కొన్నారు. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఛత్తీస్గఢ్లోని అంబికాపుర్లో జరిగిన ‘మోర్ ఆవాస్ మోర్ అధికార్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత్కు స్వతంత్రంగా స్పందించే శక్తి ఉందని, దేశ భద్రతకు భంగం కలిగించే యత్నాలను మానదీసే శక్తి భారత సైన్యంలో ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమై పాకిస్థాన్కు గట్టి బుద్ధి చెప్పిందని అన్నారు.
“మన సైనికుల ధైర్యసాహసాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం తీసుకున్న కఠిన నిర్ణయాలు అన్ని ప్రశంసనీయం. మన ఆడబిడ్డల సిందూరం తుడిచిన వాళ్లను వారి ఇంట్లోనే చిత్తు చేయడం భారత శౌర్యానికి నిదర్శనం” అని చౌహాన్ వ్యాఖ్యానించారు.
ఉగ్రవాద నిర్మూలన విషయంలో కేంద్ర ప్రభుత్వం భారత సైన్యానికి సంపూర్ణ స్వేచ్ఛను కల్పించిందని తెలిపారు. దీని వల్లే పాకిస్థాన్ పన్నుతున్న కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతున్నామని చెప్పారు.
అదే కార్యక్రమంలో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ (వన్ నేషన్, వన్ ఎలెక్షన్) అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తరచూ ఎన్నికలు జరుగుతున్నందున ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతోందని చెప్పిన ఆయన, ఛత్తీస్గఢ్ ప్రజలు కూడా ఈ విధానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ముందుకు తెచ్చిన ఈ ఆలోచన దేశానికి విశేష ప్రయోజనాలు చేకూరుస్తుందన్నారు.