CM Vijay

CM Vijay: ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి విజయ్ భేటీ!

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆయన, మొదట అక్కడి తమిళనాడు భవన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఇరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పీఎంవో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా పంచుకుంది.

ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ‘అనైమంగళం’ రాగి శాసనాలను తిరిగి భారతదేశానికి రప్పించడంలో ప్రధాని మోదీ చేసిన కృషిని సీఎం విజయ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ చారిత్రక సంపదను వెనక్కి తెచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వం తరఫున ఆయన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సమావేశంలో తమిళనాడుకు సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలు ప్రధాని దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా కర్ణాటకతో ఉన్న ‘మేకెదాటు డ్యామ్‌’ వివాదంపై ఇద్దరు నేతలు చర్చించారు. దీనితో పాటు, తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేయడం, వారిని వేధించడం వంటి ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతుండటంపై సీఎం విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 12 సార్లు ఇలాంటి అరెస్టులు జరిగాయని, ప్రస్తుతం 58 మంది తమిళ మత్స్యకారులు శ్రీలంక జైళ్లలో ఉన్నారని విజయ్ ప్రధానికి వివరించారు. మన మత్స్యకారులను, అలాగే వారి పడవలను వెంటనే విడుదల చేసేలా శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన ప్రధానిని కోరారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో ‘తమిళ్ తాయ్ వాళ్తు’  ఆలపించడానికి అనుమతిస్తూ తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *