Br naidu: బీహార్ రాజధాని పాట్నాలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి తెలిపింది. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల భూమిని టీటీడీకి కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఈ భూమిని 99 సంవత్సరాల పాటు కేవలం ఒక్క రూపాయి టోకెన్ లీజు రెంట్పై ఇవ్వడం ఈ నిర్ణయానికి ప్రత్యేకతను తెచ్చింది.
ఈ నిర్ణయం పట్ల బీఆర్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణ ప్రాజెక్టుకు మద్దతు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ ప్రభుత్వ దూరదృష్టి, సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్తో పాట్నాలో భక్తులకు శ్రీవారి దైవ దర్శనం పొందే అవకాశం కలవనుంది.
ఆలయ నిర్మాణానికి అవసరమైన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కోసం బీహార్ పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ను నోడల్ అధికారిగా నియమించినట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు. త్వరలోనే టీటీడీ ప్రతినిధులు బీహార్ అధికారులతో సమావేశమై, నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

