Bhatti vikramarka: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, విద్యుత్ శాఖ ఉద్యోగులందరికీ రూ. 1 కోటి ప్రమాద బీమా వర్తించనుంది.
ఈ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్యుత్ శాఖలో పని చేసే ఉద్యోగులు ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. వారి సేవలను గుర్తించి, వారికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ బీమా ఒప్పందం చేసుకున్నాం,” అన్నారు.
ఇదొక సంక్లిష్టమైన, ప్రమాదాలకు లోనయ్యే విభాగమైనందున, ఈ విధమైన బీమా ఉద్యోగుల్లో ధైర్యాన్ని, భద్రతను, నమ్మకాన్ని పెంచుతుందని ఆయన తెలిపారు. విద్యుత్ శాఖ రాష్ట్రంలో ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే అత్యంత కీలక శాఖగా గుర్తిస్తూ, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
ఈ ఒప్పందంతో విద్యుత్ శాఖ ఉద్యోగులకు మరింత భద్రత కలిగిస్తామని, ప్రభుత్వమే వారి వెన్నుదన్నుగా నిలుస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.