Jagan plans for Trobles In NDA: ఆంధ్రప్రదేశ్లో కూటమి పొత్తు విచ్ఛిన్నమవుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య చీలిక రాబోతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు ఎక్కిస్తున్న అంశాలివి. ఏపీలో ఆ మూడు పార్టీలు ఒక్కటిగా ఉన్నంత కాలం వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. జగన్కు అధికారం అన్నది కల్ల. తాను మళ్లీ గద్దెనెక్కాలంటే కూటమి విడిపోతే సాధ్యమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని తన శ్రేణులకు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారట జగన్ మోహన్రెడ్డి. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను బూచిగా చూపిస్తూ, త్వరలో కూటమిలో చీలిక రావడం ఖాయమని జగన్ తన పార్టీ నాయకులతో చెప్పినట్లు సమాచారం అందుతోంది. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత చిరంజీవి వ్యాఖ్యానించిన తీరు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన సంఘటనలను జగన్ తనకు అనుకూలంగా వాడుకుంటూ కూటమి పొత్తు బీటలు వారుతుందని తాను భావించడమే కాకుండా, ఈ కల్లబొల్లి కబుర్లను వైసీపీ నాయకులు, శ్రేణులు కూడా నమ్మితీరాలని బలవంతపెడుతున్నారట.
జగన్ కంటున్న కల వెనుక పక్కా వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కూటమిలో చీలిక తేలవాలని వైసీపీ తెరవెనుక గట్టి ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వారి సొంత కుటుంబ సభ్యుల నుంచే ఇబ్బందులు తలెత్తేలా వైసీపీ పథకం రచిస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సౌమ్యుడు. రాజకీయాల్లో చేదు అనుభవాల తర్వాత సినిమాలకే పరిమితమయ్యారు. మరోవైపు, నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో చురుకుగా ఉంటూ సినీ పరిశ్రమలోనూ కొనసాగుతున్నారు. చిరంజీవితో పోలిస్తే బాలకృష్ణ దూకుడు మనిషి. కానీ పదవులు లేదా పైరవీల కోసం ఆశించే వ్యక్తి మాత్రం కాదు. టీడీపీ పట్ల అంకితభావం ఉన్న నాయకుడు. అయితే, బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను వైసీపీ తనకు అనుకూలంగా మలచుకుని, గట్టిగా నెగెటివ్ ప్రచారం చేసింది. చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ప్రచారానికి మరింత పదును పెట్టింది వైసీపీ. బాలకృష్ణ వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టాన్ని సరిచేయడానికే చంద్రబాబు పవన్ను కలిశారని వైసీపీ చెబుతోంది. ఈ వాదనలో కొంత నిజం ఉన్నా, ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సంబంధాలు తెంచుకుంటారని ఊహించడం అతిశయోక్తి అవుతుంది.
Also Read: Ys Sharmila:ప్రైవేట్ బీమాను ఎందుకు తీసుకొస్తున్నారో
పవన్ కళ్యాణ్ రాజకీయ పరిపక్వత ఉన్న నాయకుడు. జగన్ పాలన వల్ల రాష్ట్రం తీవ్ర నష్టం చవిచూసిందని, చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ఇప్పుడు అవసరమని ప్రజల మధ్యకు తీసుకెళ్లిన వ్యక్తి పవనే. జనసేన మరో 15 ఏళ్లపాటు కూటమితో కలిసి అధికారం పంచుకోవాలని పవన్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవి కూడా షేర్ చేసుకునే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. అయితే, జనసేన ఆ స్థాయికి చేరుకోవాలంటే టీడీపీతో కలిసి నడవడం తప్పనిసరని పవన్ నమ్ముతున్నారు. అధికారం మళ్లీ జగన్ చేతుల్లోకి వెళ్లకూడదన్నది ఆయన లక్ష్యం. ఈ నేపథ్యంలో, కూటమిలో ఎన్ని అభిప్రాయ బేధాలు వచ్చినా, సమస్యలు తలెత్తినా, పవన్ వాటిని సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు సాగుతారనడంలో సందేహం లేదు. జగన్ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులను ఉపయోగించుకోవాలని చూసినా, పవన్ దానికి లొంగరని కూటమి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పొత్తు విచ్ఛిన్నమైతే ఏం జరుగుతుందో చంద్రబాబుకూ, పవన్కూ ఇద్దరికీ బాగా తెలుసు. అందుకే జగన్ ప్రచారంలో నిజం లేదు సరికదా.. అది జగన్కు కలగానే మిగిలిపోతుందని కూటమి వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.