Kavita: తెలంగాణలో పత్తి రైతుల పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పంటలో తేమ ఎక్కువగా ఉందన్న పేరుతో గిట్టుబాటు ధర ఇవ్వకుండా, రైతులను ప్రైవేట్ కొనుగోలుదారుల వద్దకు పంపిస్తున్నారని ఆమె ఆరోపించారు.
జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్లో పర్యటించిన కవిత, “రైతులు కొనుగోలు కేంద్రాల్లో గంటల తరబడి క్యూలో నిలుస్తున్నారు. అయినా సరైన ధరకే పత్తి కొనడం లేదు. ఇలా ఎందుకు అవుతోంది?”అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో ప్రచారం ఆపి రైతుల సమస్యలపై దృష్టిపెట్టాలని సూచిస్తూ తేమ శాతం అనే కారణం లేకుండా సీసీఐ పత్తిని గిట్టుబాటు ధరకు కొనాలిఅని డిమాండ్ చేశారు.
ఇక కేంద్రంలోని బీజేపీ నాయకులపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు:ఈ ప్రాంతంలో బీజేపీకి ఎంపీ, ఎమ్మెల్యేలు ఉండి కూడా రైతులకు సాయం కనిపించడం లేదు.”
కవిత పర్యటన సందర్భంగా ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె కొమురం భీం విగ్రహానికి నివాళులు అర్పించి, రైతులతో కలసి వారి సమస్యలు తెలుసుకున్నారు.

