Br naidu: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.
ఆలయాల నిర్మాణంపై ప్రణాళిక
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు ఆలయాల వరకు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మతమార్పిడులను అరికట్టడం లక్ష్యంగా, శ్రీవాణి ట్రస్టు నిధులను ఈ ఆలయాల నిర్మాణానికి వినియోగించనున్నామని స్పష్టం చేశారు.
బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక ఏర్పాట్లు
ఈనెల 23న అంకురార్పణతో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల ఏర్పాట్లను ఈసారి ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారని ఛైర్మన్ చెప్పారు.
సెప్టెంబర్ 24న మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.
అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
భక్తుల రద్దీ కారణంగా పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
భక్తుల సౌకర్యానికి కొత్త పద్ధతులు
సెప్టెంబర్ 28న జరిగే గరుడ సేవకు సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా.
చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు, వారి భద్రత కోసం తొలిసారిగా జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు.
బుక్లెట్ ఆవిష్కరణ
ఈ సందర్భంగా, బీఆర్ నాయుడు, ఈవో అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్-2025ను ఆవిష్కరించారు.