Ponam Prabhakar: తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారన్న ఆరోపణలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. “తాను నిజాయతీగా గెలిచానని నమ్మితే, తన నియోజకవర్గంలో ఓట్ల సరళిపై విచారణ జరపాలని ఎన్నికల కమిషన్ను కోరండి” అంటూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు సవాల్ విసిరారు.
గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన పొన్నం మాట్లాడుతూ, ఇటీవల కరీంనగర్లో ఒకే ఇంట్లో 40 ఓట్లు బయటపడటం సంచలనమని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి బీజేపీ కుట్రలను బయటపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
“ఓట్ల కోసమే బీజేపీ దేవుడి పేరును వాడింది”
పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల్లో బీజేపీపై తీవ్ర విమర్శలు చోటుచేసుకున్నాయి. ఆయన మాట్లాడుతూ –
“ఓట్ల కోసం బీజేపీ దేవుడి పేరును, అక్షింతలను వాడుకుంద”ని ఆరోపించారు.
“బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు మేము ఆయనకు మద్దతిచ్చాం. ఇప్పుడు అదే బీజేపీ మతం పేరుతో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం దారుణం” అని మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్లపై పోరాటం
వెనుకబడిన ముస్లింలకు ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయని, కానీ తెలంగాణ బీసీలకు అన్యాయం చేయడం సరికాదని బండి సంజయ్ను నిలదీశారు.
బీసీ బిల్లులో మతపరమైన అంశాలు లేవని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకరే చెప్పారని గుర్తుచేశారు.
“కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడమే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యానికి కారణం” అని స్పష్టం చేశారు.
ఈ బిల్లుకు ఆమోదం పొందేలా కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్లపై ఉందని హెచ్చరించారు.
బీజేపీపై మరో విమర్శల వర్షం
ఆర్. కృష్ణయ్య ధర్నాపై పొన్నం విమర్శలు గుప్పిస్తూ, “బీసీలకు అన్యాయం చేసేలా వ్యవహరించే వ్యక్తి ధర్నా చేయడం విడ్డూరం” అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా దాడి చేసి, “హైదరాబాద్ కోసం కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తీసుకువచ్చారా? మెట్రో విస్తరణకు అనుమతులు ఎందుకు తేలేకపోయారు?” అని ప్రశ్నించారు.
గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ నగరానికి తాగునీరు అదనంగా తీసుకురావడంలో వైఫల్యం ఉందని వ్యాఖ్యానించారు.