Rahul Gandhi

Rahul Gandhi: 16 రోజులు.. 23 జిల్లాలు.. రాహుల్ గాంధీ “ఓటర్ అధికార్ యాత్ర” రేపే..

Rahul Gandhi: త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణంలో, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓటు హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. శనివారం ఆయన “ఓటర్ అధికార్ యాత్ర”ను ససారాం నుంచి ప్రారంభించారు.

16 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో 25 జిల్లాలను కవర్ చేస్తూ, దాదాపు 1300 కిలోమీటర్ల మేర రాహుల్ ప్రజల మధ్య పాదయాత్ర, సభలు, సమావేశాల ద్వారా అవగాహన కల్పించనున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మహా ర్యాలీతో యాత్ర ముగియనుంది.

“ఒక వ్యక్తి – ఒక ఓటు” హక్కు కోసం పోరాటం

ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న “ఓట్ల దొంగతనం” (Vote Chori)పై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమిక హక్కు అయిన “ఒక వ్యక్తి – ఒక ఓటు” సూత్రాన్ని రక్షించుకోవడానికి ఈ యాత్ర నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. “రాజ్యాంగాన్ని కాపాడటానికి బీహార్‌లో మాతో చేరండి” అని రాహుల్ ప్రజలకు పిలుపునిచ్చారు.

మహాఘట్బంధన్ మద్దతు

ఈ యాత్రకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో పాటు మహాఘట్బంధన్ మిత్రపక్షాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. “ఏ ఓటరు హక్కులు కోల్పోకుండా, ఎవరి పేరు జాబితాలో వదిలిపెట్టకుండా ప్రజల్లో అవగాహన పెంచడం మా ప్రధాన లక్ష్యం” అని తేజస్వీ తెలిపారు. యాత్రకు సంబంధించిన ప్రత్యేక ప్రచార గీతాన్ని ఆయన సోషల్ మీడియాలో విడుదల చేస్తూ, బీహార్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సంఘంపై ఆరోపణలు

రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా లోపాలను, “ఓట్ల దొంగతనం” జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌లోని ఓ నియోజకవర్గానికి చెందిన డేటాను చూపిస్తూ ఎన్నికల సంఘం బిజెపితో కుమ్మక్కైందని ఆయన ఆరోపించారు. అయితే, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తిరస్కరించింది.

ప్రజాస్వామ్య పరిరక్షణకే యాత్ర

బీహార్ ఎన్నికల ముందు ప్రారంభమైన ఈ యాత్రను ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య రక్షణ ఉద్యమంగా చూస్తున్నాయి. ఎన్నికల పారదర్శకత, ప్రతి ఓటరు హక్కు, ప్రజల స్వరాన్ని రక్షించుకోవడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *