Donald Trump: అమెరికన్ డాలర్ ప్రపంచ కరెన్సీగా తన స్థానాన్ని కోల్పోకుండా చూసేందుకు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమిపై పదునైన విమర్శలు గుప్పించారు. డాలర్ పతనాన్ని తాము ఎప్పటికీ సహించబోమని, అలా జరిగితే అది అమెరికా ఓటమిగా భావిస్తామని ఆయన స్పష్టం చేశారు. డాలర్కు వ్యతిరేకంగా వ్యవహరించే ఏ దేశం అయినా 10% అదనపు సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
క్రిప్టో కరెన్సీ చట్టబద్ధతకు సంబంధించిన ‘జీనియస్’ బిల్లుపై సంతకం చేసిన అనంతరం వైట్హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. “బ్రిక్స్ అనే ఓ చిన్న సమూహం ఉంది. అది చాలా వేగంగా తన ప్రాబల్యాన్ని కోల్పోతోంది. వారిని మేం చాలా బలంగా దెబ్బతీశాం. డాలర్ ఆధిపత్యాన్ని నియంత్రించాలని, మా కరెన్సీ ప్రమాణాన్ని అధిగమించాలని వారు ప్రయత్నిస్తున్నారు. అందుకే వారిపై టారిఫ్లు విధిస్తామని ప్రకటించాం” అని ట్రంప్ వెల్లడించారు.
“మాతో ఆటలు వద్దు. అమెరికా డాలర్కు గ్లోబల్ రిజర్వ్ హోదా ఉంది. దాన్ని ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఉంది. డాలర్ విలువ తగ్గడాన్ని మేం ఎన్నటికీ అంగీకరించబోం. మా కరెన్సీ స్టేటస్ పడిపోతే.. దాన్ని మేం ఓటమిగానే భావిస్తాం” అని ట్రంప్ తేల్చి చెప్పారు.
Also Read: ACB Raids: ఆగని అవినీతి జాఢ్యం.. రెండు రోజుల్లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల పట్టివేత
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో బ్రిక్స్ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేసియా కూడా ఇందులో చేరాయి. ఈ పది దేశాలను కలిపి బ్రిక్స్ ప్లస్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ ఏకపక్ష సుంకాల పెంపుపై ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, బ్రిక్స్ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. బ్రిక్స్ దేశాల పైనా టారిఫ్లు ఉంటాయని ప్రకటించారు.
ప్రతీకార సుంకాలపై ప్రపంచదేశాల్లో వ్యతిరేకత వస్తున్నా ట్రంప్ తగ్గేదేలేదంటున్నారు. అమెరికా విధానాలను వ్యతిరేకించే దేశాలపై 10శాతం అదనపు సుంకం తప్పదంటున్నారు. అయితే ట్రంప్ ఏకపక్ష టారిఫ్లను బ్రిక్స్ దేశాలు వ్యతిరేకించాయి. బ్రిక్స్ ప్రకటనపై భారత్ కూడా సంతకం చేసింది. రియో డిక్లరేషన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, బ్రిక్స్ దేశాలను వదిలేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాక గ్లోబల్ ట్రేడ్ వార్ మొదలయ్యింది. ఏప్రిల్లో 10 శాతం బేస్ టారిఫ్ రేటుతో చాలా దేశాలకు అదనపు టారిఫ్లను ప్రకటించారు. కొన్ని దేశాలపై 50 శాతం వరకు సుంకాలు విధించారు. బ్రిక్స్ దేశాలు అమెరికా సుంకాలను తప్పుపట్టటంతో, టారిఫ్ల విషయంలో ట్రంప్ తన పంతం మీద ఉన్నారు. డాలర్ ఆధిపత్యాన్ని కాపాడేందుకు ఆయన ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోరని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.