మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ సహా ఇతరత్రా మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారని గుర్తుచేశారు.
మూసీ సుందరీకరణ పేరుతో పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నారే తప్ప ఏ మార్పు లేదని చెప్పారు.రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని, ఇది జాతీయ సగటు కంటే రూ.40 వేలు ఎక్కువని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 92 శాతం కుటుంబాలు అప్పుల్లోనే ఉన్నాయని తెలిపారు. జాతీయ సగటు 52 శాతం కుటుంబాలు మాత్రమేనన్నారు.తెలంగాణ రాష్ట్రం, ప్రజల ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో మళ్లీ అప్పులు చేసి మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రజలపై మోయలేని భారం మోయడాన్ని, పేదల ఇండ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని వెళ్లడించారు.
ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన ఈనెల 25న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని కోరరు