Suresh Kalmadi: ప్రముఖ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1944 మే 1వ తేదీన మద్రాసులో జన్మించిన కల్మాడి, తన జీవితంలో సైనిక, రాజకీయ, క్రీడా రంగాలలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణవార్త తెలియగానే రాజకీయ, క్రీడా ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
రాజకీయాల్లోకి రాకముందు సురేశ్ కల్మాడి భారత వాయుసేనలో పైలట్గా సేవలు అందించారు. 1964 నుంచి 1972 వరకు వైమానిక దళంలో పనిచేసిన ఆయన, 1965 – 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధాలలో చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మంత్రివర్గంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పుణె నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: Konaseema: కోనసీమ మలికిపురంలో ఆరని ఓఎన్జీసీ బ్లోఅవుట్!
సురేశ్ కల్మాడి పేరు క్రీడా రంగంలోనూ ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన సుదీర్ఘ కాలం పాటు భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షుడిగా పనిచేశారు. ముఖ్యంగా 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కమిటీ ఛైర్మన్గా వ్యవహరించారు. అయితే, ఆ క్రీడల నిర్వహణలో వచ్చిన అవినీతి ఆరోపణలు ఆయన రాజకీయ జీవితంపై కొంత ప్రభావం చూపాయి. ఏది ఏమైనా, దేశానికి పైలట్గా, మంత్రిగా ఆయన అందించిన సేవలను పలువురు ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు.
