Kerala: ఆర్మీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇంటికి వచ్చి తన సహోద్యోగి సాయంతో తన భార్య, పిల్లలను హతమార్చాడు. తరువాత ఇద్దరూ పారిపోయారు. ఉద్యోగానికి కూడా వెళ్లకుండా ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 19 ఏళ్ల తరువాత వారిద్దరూ ఇప్పుడు పట్టుబడ్డారు. ఆసక్తికరంగా ఉన్న ఈ విషయం పూర్తి వివరాలు ఇవే.
కేరళలోని కొల్లం జిల్లాలోని ఆంచల్ సమీపంలోని యర్రం వద్ద 10 ఫిబ్రవరి 2006న, ఒక అవివాహిత మహిళ- ఆమె 17 రోజుల కవల కుమార్తెలు హత్యకు గురయ్యారు. హంతకుడు డిబిల్ కుమార్ బి, ఈ ప్రాంతానికి చెందినవాడు. అతను 2006లో ఇండియన్ ఆర్మీకి చెందిన 45 A.D. రెజిమెంట్లో పనిచేస్తున్నాడు. అతని రెజిమెంట్లోనే పనిచేస్తున్న మరో వ్యక్తి రాజేష్ ఈ హత్యకు సహకరించాడు. హత్యల తర్వాత, నిందితులిద్దరూ రెజిమెంట్కు తిరిగి రాకుండా పారిపోయారు. మార్చి 2006లో, సైన్యం వారిని పారిపోయిన వ్యక్తులుగా ప్రకటించింది.
హత్య జరిగిన 19 ఏళ్ల తర్వాత, కుమార్, రాజేష్లు పుదుచ్చేరిలో గుర్తింపులు మార్చుకుని జీవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం దొరికింది. దీంతో అక్కడ సోదాలు చేసి జనవరి 3న చెన్నై సీబీఐ వారిద్దరినీ అరెస్టు చేసి కొచ్చికి తీసుకొచ్చింది. వీరిద్దరూ పుదుచ్చేరిలో ఉంటూనే పెళ్లి చేసుకున్నారు. ఎర్నాకులం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నిందితులిద్దరినీ జనవరి 18 వరకు పోలీసు కస్టడీకి పంపింది. కేరళ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించారు. నిందితుల పాత ఫోటోలను ఇప్పటి ఫొటోలతో సరిపోల్చారు. వీరిద్దరూ పేరు మార్చుకుని, ఐడెంటిటీ మార్చుకుని జీవిస్తున్న విషయం బయటపడింది. దీంతో 19 ఏళ్ల తరువాత నిందితులు చిక్కారు.
ఇది కూడా చదవండి: Today Horoscope: ప్రశాంతంగా పనిచేస్తే అడ్డంకులు తొలగిపోతాయి.. ఈరోజు రాశిఫలాలు ఇలా..
హత్యకు పితృత్వ పరీక్షే కారణం
24 ఏళ్ల రంజిని తన తల్లితో కలిసి అంచల్లో నివసించేది. రంజిని మరియు దిబిల్ కుమార్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. 24 జనవరి 2006న, రంజిని కవల కుమార్తెలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కుమార్ రంజిని నుండి దూరంగా ఉండడం ప్రారంభించాడు. ఈ విషయంపై రంజిని కేరళ రాష్ట్ర మహిళా కమిషన్కు కుమార్పై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కమిషన్ పితృత్వ పరీక్షను ఆదేశించింది. దీంతో కోపోద్రిక్తుడైన కుమార్ రంజిని, ఆమె కుమార్తెలను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. సిబిఐ అందించిన వివరాల ప్రకారం, కుమార్ తనతో పాటు పనిచేస్తున్న రాజేష్ను రంజిని వద్దకు పంపాడు. పెళ్లికి సాయం చేస్తానని రంజిని కుటుంబానికి రాజేష్ హామీ ఇచ్చాడు. కానీ, నిజానికి హత్యలో కుమార్కు మద్దతిచ్చాడు. హత్య జరిగిన రోజు, కవలల జనన ధృవీకరణ పత్రం కోసం రంజిని తల్లి పంచాయతీ కార్యాలయానికి వెళ్లి తిరిగి వచ్చింది. ఇంట్లో తన కుమార్తె, మనవరాలు మృతదేహాలను చూసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించింది.
ఇది కూడా చదవండి: OYO Rooms: ఆ ప్రూఫ్ లేకపోతే నో రూమ్.. జంటలకు షాక్ ఇచ్చిన ఓయో రూమ్స్..
పేరు మార్చుకుని పుదుచ్చేరిలో దాక్కుని..
నిందితులిద్దరి కోసం కేరళ పోలీసులు వెతికినా ఫలితం లేకపోయింది. ఇద్దరిపైన ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రివార్డు కూడా ప్రకటించారు. 2010లో కేరళ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అయితే అతడిని పట్టుకోవడంలో ఏజెన్సీ కూడా విఫలమైంది. ఆ ప్రాంతం నుంచి పారిపోయిన నిందితులిద్దరూ పుదుచ్చేరి చేరుకున్నారు. ఇక్కడ వారు తమ పేర్లు, గుర్తింపును మార్చుకున్నారు. కుమార్ – విష్ణుగా.. రాజేష్ -ప్రవీణ్ గా అక్కడ చలామణి కావడం మొదలు పెట్టారు. ఆ పేర్లతో ఐడీలు కూడా సృష్టించుకున్నారు. అక్కడ వారిద్దరూ పెళ్లిళ్లు చేసుకుని ఆస్తులు కూడా కొనుక్కున్నారు.
అయితే, ఇటీవల ఈ కేసు విషయంలో కేరళ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించారు. నిందితుడు ఎవరన్నది తెలుసుకుని సోషల్ మీడియాలో ఉన్న ఫొటోలను పోల్చి చూశారు. ఒక ఫోటోగ్రాఫ్లో కుమార్ పుదుచ్చేరిలో ఒక వివాహానికి హాజరవుతున్నట్లు కనిపించింది. దీనికి మరింత లోతుగా దర్యాప్తు చేసి ఆ తర్వాత బృందాలు పుదుచ్చేరికి చేరుకుని అతన్ని, అతని స్నేహితుడిని అరెస్టు చేశారు.