Uday Krishna Reddy: హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇంకా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా హైదరాబాద్లోని ఆయన రెండు నివాసాల్లోనూ అందుబాటులో లేరు. దీంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
1. హైకోర్టును ఆశ్రయించిన ఉదయ్ కృష్ణారెడ్డి
తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పలు సంచలన విషయాలను పేర్కొన్నారు..
-
ప్రేమ వ్యవహారం: ముస్సోరిలో శిక్షణ పొందుతున్న సమయంలో తామిద్దరం ప్రేమించుకున్నామని, సర్వీస్లోకి వచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని తెలిపారు.
-
మరో అధికారిణితో పెళ్లి: అయితే, తనకు వేరే యువతితో సంబంధం ఉందనే అనుమానంతో ఆ మహిళా అధికారిణి మే నెలలో ఓ ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకున్నారని వెల్లడించారు.
-
తిరస్కరించడంతోనే తప్పుడు కేసు?: వివాహం తర్వాత కూడా ఆమె తన వద్దకు వచ్చి పాత సంబంధాన్ని కొనసాగించాలని కోరిందని, తాను తిరస్కరించడంతో ఈ విషయం ఆమె భర్తకు తెలిసిందన్నారు. తమ పాత వీడియోను ఆమె భర్తకు పంపడంతో దంపతుల మధ్య గొడవలు వచ్చాయని, ఆ కక్షతోనే తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని ఉదయ్ పేర్కొన్నారు.
2. పోలీసుల విచారణ తీవ్రతరం
కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ, పోలీసుల విచారణకు హాజరుకాకుండా ఉదయ్ కృష్ణారెడ్డి అందుబాటులో లేకుండా పోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. త్వరలోనే ఆయనను అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు సమాచారం.
