Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి (లాల్పూర్-పాండేపూర్ పోలీస్ స్టేషన్ పరిధి) అకథా ప్రాంతంలో ఒక ప్రైవేట్ ప్లే స్కూల్లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్యాంట్లోనే మూత్రం పోసుకున్నాడనే కారణంతో ఓ ఉపాధ్యాయురాలు ఐదేళ్ల పసివాడి ప్రైవేట్ పార్ట్ను వేడి కత్తితో కాల్చిందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.
1. అసలేం జరిగింది?
ప్లే స్కూల్లో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలుడు శుక్రవారం వాష్రూమ్కి వెళ్లేందుకు టీచర్ను అనుమతి కోరాడు. కానీ ఉపాధ్యాయురాలు ఒప్పుకోకపోవడంతో, ఆ చిన్నారి ఆపుకోలేక ప్యాంట్లోనే మూత్రం పోసుకున్నాడు. దీనిపై కోపంతో ఊగిపోయిన టీచర్, బాలుడిని వేరే గదిలోకి తీసుకెళ్లి వేడి కత్తితో అతడి ప్రైవేట్ పార్ట్పై కాల్చిందని, ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించిందని బాధితుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
2. బయటపడింది ఇలా..
బడి నుంచి ఇంటికి వచ్చాక బాలుడు నొప్పితో ఏడవడంతో తల్లి పరిశీలించగా బొబ్బ (blister) కనిపించింది. పసివాడిని ప్రశ్నించగా స్కూల్లో జరిగిన దారుణాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. దీనిపై బాలుడి తల్లి స్కూల్ ప్రిన్సిపాల్ను ప్రశ్నించగా, ఆమె సదరు టీచర్పై చర్యలు తీసుకోకపోగా ఎదురు బెదిరింపులకు దిగిందని తల్లిదండ్రులు తెలిపారు.
3. పోలీసుల కేసు నమోదు & విచారణ
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్కూల్ యాజమాన్యంతో పాటు ఆ టీచర్పై కేసు నమోదు చేశారు. లాల్పూర్-పాండేపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అతుల్ సింగ్ మాట్లాడుతూ.. స్కూల్ యాజమాన్యం, టీచర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. అయితే, డిడియు (DDU) జిల్లా ఆస్పత్రి వైద్య నివేదికలో (Medical Report) కాలిన గాయాలు ఉన్నట్లు స్పష్టంగా పేర్కొనలేదని, ప్రస్తుతం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు.
