Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి.చలితో ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్లే రికార్డు అవుతున్నాయి. ఏజెన్సీ ఏరియాలతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి.కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నది.కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డిల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 9.2, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 9.5, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 9.7 డిగ్రీల చొప్పున కనిష్ట టెంపరేచర్లు రికార్డయ్యాయి.కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుండగా.. మరో 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నది. మరికొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అంటున్నారు.