TG Assembly 

TG Assembly: గౌరవ సభ కాస్తా.. కౌరవ సభగా మారింది.. హరీశ్‌రావు 

TG Assembly: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండో రోజూ తీవ్ర రాజకీయ వేడికి, భావోద్వేగాలకు వేదికగా మారాయి. నిన్న అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్న ఘటనలపై సభ ప్రారంభమైన వెంటనే అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రసంగిస్తున్న సమయంలో జోక్యం చేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనై ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గౌరవ సభ కాస్తా.. కౌరవ సభగా మారింది.. హరీశ్‌రావు 

సీనియర్ మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిల పట్ల అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని హరీశ్‌రావు మండిపడ్డారు. దాడి చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఠాణాలో ఫిర్యాదు చేస్తే, తిరిగి బీఆర్‌ఎస్ నేతలపైనే అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.

కలియుగ దుశ్శాసనుడు..
ఈ పరిణామాన్ని రాష్ట్రంలోని యావత్ మహిళా లోకంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలియుగ దుశ్శాసనుడిలా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన గౌరవ సభను కౌరవ సభగా మార్చేశారు. ఆనాడు కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుంది” అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
నీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు.. కన్నీటిపర్యంతమైన స్పీకర్
హరీశ్‌రావు ఆవేశంగా ప్రసంగిస్తుండగా స్పీకర్ ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. “సభలో మీరు మాట్లాడుతుంటే నేను ఓపిగ్గా వింటున్నాను కదా.. మీరెందుకు అంత ఆవేశపడుతున్నారు? వాస్తవానికి ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి. ఎందుకంటే అక్కడ దూషించింది నీ తల్లిని కాదు.. లేని నా తల్లిని అన్నారు” అంటూ స్పీకర్ అత్యంత ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు ఎనిమిది మంది సోదరీమణులు ఉన్నారు..
మహిళా సభ్యులంటే యావత్ సభతో పాటు వ్యక్తిగతంగా తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. తనకున్న ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లతో సమానంగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిలను తన సొంత సోదరీమణులుగా భావిస్తానని పేర్కొన్నారు.
నివేదిక రాగానే చర్యలు..

అసెంబ్లీ గేటు వద్ద మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారానికి సంబంధించి సమగ్ర విచారణ నివేదిక రాగానే బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సభాపతి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *