Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ వేడి తారస్థాయికి చేరుకుంది. భారాస ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సస్పెన్షన్కు కారణం ఏమిటి?
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ – భారాస సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో జగదీశ్రెడ్డి మాట్లాడుతూ, “ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు.” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సభా సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయని స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మంత్రి సీతక్క, జగదీశ్రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని అసెంబ్లీలో ప్రతిపాదించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సభావ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ సెషన్ ముగిసే వరకు జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించగా, స్పీకర్ ఆమోదం తెలిపారు.
Also Read: CM Revanth Reddy: బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి!
భారాస ఎమ్మెల్యేల నిరసన
జగదీశ్రెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో, భారాస సభ్యులు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. “మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి” అంటూ డిమాండ్ చేశారు.
జగదీశ్రెడ్డి, కేసీఆర్ ఛాంబర్లో కూర్చోగా, చీఫ్ మార్షల్ వచ్చి సభ నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
“సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని, ప్రతిపక్ష నేత ఛాంబర్లో కూర్చుంటే అభ్యంతరం ఎందుకు?” అని భారాస ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. జగదీశ్రెడ్డి సస్పెన్షన్పై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరగగా, ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని స్పీకర్ సూచించారు. తెలంగాణ అసెంబ్లీలో ఇంకా రాజకీయ వేడి తగ్గే సూచనలు కనిపించకపోవడం విశేషం.