India Pakistan War: కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు ధర్మ రక్షణ కోసం అస్త్ర శస్త్రాలతో అధర్మాన్ని సంహరించినట్లు, ఆపరేషన్ సిందూర్తో భారత త్రివిధ దళాలు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తున్నాయి. భగవద్గీతలో కృష్ణుడు బోధించిన కర్మ యోగంతో ప్రేరేపించబడినట్లుగా మన భారత సైన్యాలు శత్రు సేనల్ని నిర్మూలించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి. ఈ యుద్ధంలో భారత్ ప్రయోగించిన ఆధునిక అస్త్రాలు కురుక్షేత్ర సంగ్రామం నాటి అస్త్ర శక్తికి తక్కువేమీ కాదనేలా ఉంటున్నాయ్.
భారత సైన్యం ఈ ధర్మ యుద్ధంలో పాక్ ఉగ్రవాదాన్ని అంతం చేసి, ప్రపంచానికి పట్టిన పాక్ ఉగ్ర పీడని వదిలిస్తోంది. ఆపరేషన్ సిందూర్, మే 7, 2025న భారత సైన్యం… పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులతో ప్రారంభమైంది. ఈ ఆపరేషన్, ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లో 26 మంది పౌరుల మరణానికి కారణమైన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా జరిగింది. భారత త్రివిధ దళాలు ఈ యుద్ధంలో ఉపయోగించిన కొన్ని కీలక అస్త్రాలు… కురుక్షేత్ర సంగ్రామం నాటి అస్త్రాలకు తక్కువేమీ కాదనేలా ఉన్నాయ్.
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. భారత అమ్ములపొదిలోని బ్రహ్మాస్త్రం. దీని రేంజ్: 300 నుండి 500 కిలో మీటర్లు. దీని వేగం గంటకు 3600 కిలోమీటర్లు. ఈ క్షిపణి ఖచ్చితమైన లక్ష్య సాధనతో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తుంది. ఆపరేషన్ సిందూర్లో రాఫెల్ యుద్ధ విమానాల నుండి దీనిని ప్రయోగించినట్లు చెప్తున్నారు. బహవల్పూర్లోని జైష్-ఎ-మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కర్-ఎ-తొయిబా స్థావరాలను ధ్వంసం చేసింది ఈ బ్రహ్మోస్ క్షిపణులే అని జాతీయ మీడియాలో కొన్ని కథనాలొచ్చాయ్. అయితే.. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినట్లు ఖచ్చితమైన సమాచారం లేదు.
స్కాల్ప్. దీనినే స్టార్మ్ షాడో అని కూడా పిలుస్తారు. ఈ క్రూయిజ్ క్షిపణి భారత అమ్ములపొదిలోని పాశుపతాస్త్రం. దీని రేంజ్: 450 కిలోమీటర్లు. స్టెల్త్ సాంకేతికతతో తక్కువ ఎత్తులో ఎగురుతూ, రాడార్లకు చిక్కుండా బంకర్లు, ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేస్తుంది. రాఫెల్ యుద్ధ విమానాల నుండి ప్రయోగించబడి, ముజఫ్ఫరాబాద్లోని సయ్యద్నా బిలాల్ క్యాంప్ను నాశనం చేసినట్లు పేర్కొంటున్నారు. ఈ క్షిపణికి వల్లే… అత్యంత ఖచ్చితత్వంతో హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలను మట్టుబెట్టడం వీలైంది.
HAMMER ప్రెసిషన్-గైడెడ్ బాంబు. ఇంద్రుని ఐందాస్త్రం లాగా ఈ హ్యామర్ బాంబు శత్రు సైన్యాన్ని పేల్చి వేస్తుంది. HAMMER: రేంజ్: 50-70 కిలోమీటర్లు. డైనమిక్ లక్ష్యాలను ఖచ్చితంగా ధ్వంసం చేయగలదు. ఆపరేషన్ సిందూర్లో శకర్ గఢ్, సియాల్కోట్ సమీపంలోని ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేయడానికి ఉపయోగించబడినట్లుగా చెప్తున్నారు. మధ్యస్థ శ్రేణి లక్ష్యాలను, ముఖ్యంగా చలనశీలంగా ఉన్న టార్గెట్లను మట్టుబెట్టడంలో HAMMER కీలక పాత్ర పోషిస్తుంది.
S-400 సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సుదర్శన చక్రం అంటే విష్ణువు ఆయుధం. ఈ ఆయుధం ప్రయోగిస్తే శత్రువు తప్పించుకోవడం అసాధ్యం. S-400 యొక్క రక్షణ సామర్థ్యం కారణంగా దీనిని సుదర్శన చక్రంతో పోల్చింది భారత ఆర్మీ. S-400 రేంజ్ 400 కిలోమీట్లర్లు. శత్రు క్షిపణులు, డ్రోన్లను ఆకాశంలోనే నాశనం చేస్తుంది. జమ్మూ విమానాశ్రయంపై పాకిస్థాన్ ప్రయోగించిన 8 క్షిపణులను సమర్థవంతంగా నిరోధించింది ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.
లోయిటరింగ్ మ్యూనిషన్స్. వీటినే కమికేజ్ డ్రోన్స్ అని పిలుస్తారు. ఇది కర్ణుడి చేతిలో విజయధనుస్సు లాంటి ఆయుధం. ఈ కమికేజ్ డ్రోన్స్ రేంజ్ ఒకేలా ఉండదు. డ్రోన్స్ని బట్టి వాటి రేంజ్ మారుతు ఉంటుంది. సాధారణంగా 50-100 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను గుర్తించి, స్వయంచాలకంగా లేదా రిమోట్ నియంత్రణతో దాడి చేస్తాయి. ఆపరేషన్ సిందూర్లో భారత వాయుసేన ఈ డ్రోన్లను ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేయడానికి ఉపయోగించింది. కోట్లీ, భింబర్ వంటి ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలను గుర్తించి నాశనం చేయడంలో ఈ డ్రోన్లు సమర్థవంతంగా పనిచేశాయి. ఇక పాకిస్తాన్ దాడులకు ప్రతిస్పందనగా, భారత్ రక్షణాత్మక వ్యవస్థలైన S-400 మరియు ICUGను ఎక్కువగా ఉపయోగించిందనీ, అలాగే లాహోర్లోని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేయడానికి హార్పీ డ్రోన్లను వినియోగించిందని జాతీయ మీడియా వార్తా కథనాలు పేర్కొన్నాయ్.
మన అస్త్రాలు శత్రు స్థావరాలను బూడిద చేశాయి. 25 నిమిషాల ఆపరేషన్ సిందూర్లో 9 ఉగ్రవాద స్థావరాలు శిథిలమయ్యాయి. జైష్-ఎ-మహమ్మద్ క్యాంప్ను శిథిలాలుగా మార్చాయి. హిజ్బుల్ ముజాహిదీన్ బంకర్లను ధ్వంసం చేశాయి. పాక్ మనపై ప్రయోగించిన క్షిపణులను ఆకాశంలోనే తునాతునకలుగా చేశాయి. జమ్మూ విమానాశ్రయాన్ని, మన పౌరుల్ని సురక్షితం చేశాయి. ప్రపంచానికి భారత సైనిక శక్తిని చాటాయి.