Bandi Bhagirath: తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో నిందితుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై రాష్ట్ర హైకోర్టులో సోమవారం నాటి సుదీర్ఘ వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల లాయర్లు ఇంకా ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలను నిశితంగా విన్న న్యాయస్థానం.. ఈ పిటిషన్పై తన తుది తీర్పును రిజర్వ్ చేసింది. నిందితుడు బండి భగీరథ్కు ఎలాంటి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయవద్దని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టుకు గట్టిగా విజ్ఞప్తి చేశారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నందున, అతనికి బెయిల్ ఇస్తే అధికార బలంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం ఉన్నందున నిందితుడు జైల్లో ఉంటేనే విచారణ పారదర్శకంగా సాగుతుందని కోర్టుకు వివరించారు.
ఇదే సమయంలో కేసు దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు హైకోర్టులో బలమైన కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తూ సంచలన విషయాలను వెల్లడించారు. బాధితురాలైన బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తొలుత కేసు నమోదు చేశామని, అయితే అనంతరం సదరు బాలిక నుంచి సేకరించిన అధికారిక వాంగ్మూలంలో (Statement) ఆరోపణలు అత్యంత తీవ్రంగా ఉండటంతో చట్టప్రకారం అభియోగాలను మరింత సవరించినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడు సదరు బాలికతో స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని, ఆపై పలుమార్లు నమ్మించి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి వాంగ్మూలం ద్వారా స్పష్టమవుతోందని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. నిందితుడు బయటకు వస్తే సాక్షులు భయంతో స్టేట్మెంట్లు ఇవ్వడానికి నిరాకరిస్తారని, అందుకే బెయిల్ నిరాకరించాలని కోరారు. ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? భగీరథ్కు బెయిల్ లభిస్తుందా లేక జైలు శిక్షే కొనసాగుతుందా అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
