Rayapati shailaja: నోటీసులు ఇస్తాం.. విచారణకు రప్పిస్తాం

Rayapati shailaja: వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. రాజధాని అమరావతి ప్రాంతంలోని మహిళలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సజ్జలకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ మంగళవారం స్పష్టం చేశారు. ఆయ‌న‌ వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొననున్నట్టు తెలిపారు.

మంగళగిరిలో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయంలో రాజధాని ప్రాంతానికి చెందిన మహిళలు ఛైర్‌పర్సన్‌ను కలిసి, సజ్జల వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదనతో ఫిర్యాదు చేశారు. తమపై వైసీపీ నేతలు చులకన భావంతో వ్యవహరిస్తున్నారనీ, గత ఐదేళ్లలో అక్రమ కేసులు బనాయించి వేధించారని, ఇప్పుడు ఎన్నికల పరాజయం తర్వాత మానసికంగా హింసించేలా మాట్లాడుతున్నారని వారు వాపోయారు.

సజ్జల వ్యాఖ్యల ద్వారా తమను అవమానించడమేగాక, రాష్ట్రంలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడానికి తమను బాధ్యులుగా చూపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మీడియా రిపోర్టుల ఆధారంగా మహిళా కమిషన్ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సుమోటోగా (స్వయంచాలకంగా) విచారణకు స్వీకరించింది. జాతీయ మహిళా కమిషన్‌కు దీనిపై లేఖ రాసినట్టు ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. మహిళల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అప్రయోజకమని ఆమె హితవు పలికారు. సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cm chandrababu: మండలాల పరిధిలో టెక్ టవర్లు నిర్మిస్తాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *